
తొక్కిసలాట
–కొత్త సినిమా గురూ !
– కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, హీరో
– అన్నీతానై నడిపిన రేవంత్
– సినీపెద్దల ముందు సీఎం సిన్మా !!
సినిమా చూపిస్తా మామా అంటూ సీఎం రేవంత్… తెలుగు సినీ ఇండస్ట్రీకి కొత్త సినిమా చూపించారు. ఈ సినిమాలో అన్ని తానై కథ నడిపించారు. కథానాయకుడిగా సినీపరిశ్రమను తనవద్దకు రప్పించుకున్నారు. తొక్కిసలాట సినిమా చూపించినట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలో తానేందుకు అంతగా రియాక్ట్ కావల్సివచ్చిందో సినీ ప్రముఖులకు వివరించారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సినీప్రముఖులతో సీఎం రేవంత్ పాల్గొన్నారు. 45 మంది సినీ ప్రముఖులను సమావేశానికి ఆహ్వానించారు. సినీరంగ పెద్ద మనిషిగా భావించే అన్నయ్య చిరంజీవి.. ఈ సమావేశానికి రాలేదు. సినిమా షూటింగ్స్ కారణంగా రేవంత్ తో భేటీకి రాలేదని చెబుతున్నారు. ఇక దబిడదబిడ చేసే బాలయ్య బాబు సైతం సీఎం రేవంత్ భేటీకి దూరంగా ఉన్నారు. ఇక ముఖ్యమంత్రితో తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అల్లు అరవింద్, మురళీమోహన్, శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభం కాగానే తొలి అంశంగా సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపైనే చర్చించారు. మహిళ మృతి చెందిన కారణంగానే తొక్కిసలాట ఘటనను సిరియస్ గా తీసుకున్నట్లు చెప్పారు సీఎం రేవంత్. శాంతిభద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని వివరించారు. బౌన్సర్ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బౌన్సర్ల విషయంలో సెలబ్రెటీలే బాధ్యత వహించాలని సూచించారు.
సమావేశంలో సినీప్రముఖులకు తొక్కిసలాట రోజు జరిగిన ఘటన విజువల్స్ ను సీఎం చూపించినట్లు ప్రచారం జరుగుతోంది. 9 నిమిషాల తొక్కిసలాట వీడియో ప్రదర్శించినట్లు పలువురు చెబుతున్నారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజు మాత్రం సీఎం తమకు ఎలాంటి వీడియోలు చూయించలేదని వివరణ ఇచ్చారు. కొన్న ఛానెళ్లలో సినిమా చూపించినట్లు ప్రచారం చేయడాన్ని ఆయన ఖండించారు. బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంపు అంశాలు చర్చకు రాలేదని దిల్ రాజు వివరించారు. సినీపరిశ్రమ అభివృద్ధిపైనే రాష్ట్ర ప్రభుత్వంతో సానుకూలవాతావరణంలో చర్చలు జరిగినట్లు వివరించారు. ఇక తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం సినిమా ఇష్యూస్ అన్నీ ఇక క్లోజ్ అంటూ ప్రకటించారు.
సినీరంగ సమస్యలపై మంత్రివర్గం ఉపసంఘం వేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలు తదితర అంశాలపై క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే త్వరలోనే సినిమారంగ ప్రముఖులతో మరోసారి భేటీ అయ్యే అవకాశముంది. సంక్రాంతికి కొత్త సినిమాలు రాబోతున్న నేపథ్యంలో క్యాబినెట్ సబ్ కమిటీ వేసి.. నివేదిక సమర్పించిన తర్వాత ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునే అవకాశముంది. బెనిఫిట్ షోలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి క్లారిటితో ఉన్నారు.బెనిఫిట్ షోలు అనుమతించేది లేదని ప్రకటించారు. బెనిఫిట్ షో పేరుతో కాకుండా మరోపేరుతో షోలకు అనుమతి ఇవ్వవచ్చని సినిమా వర్గాలు ఆశిస్తున్నాయి.